కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

కర్నూలు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చేందుకు ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఆదివారం ఉదయం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రమానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తారు. మార్గమధ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందచేస్తారు. మధ్యాహ్నం 2గం.30 నిమిషాలకు శిరివెళ్ళ చేరుకుని రచ్చబండ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందచేసి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.