పవన్ కళ్యాణ్ పర్యటనకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం

• ధర్మాజీగూడెం వద్ద రోడ్డును తవ్వేస్తున్న వైనం
• అడ్డుకున్న జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా – బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించేందుకు ఏప్రిల్ 23వ తేదీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి రానున్న నేపథ్యంలో యాత్రను అడ్డుకునేందుకు, ఆటంకాలు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. చింతలపూడి నియోజకవర్గం, ధర్మాజీగూడెం వద్ద ఆర్ అండ్ బి రహదారిని అడ్డంగా తవ్వించేస్తున్నారు. ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తుండడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చింతలపూడిలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తూ మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు జేసీబీని అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారి యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.