ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాకు మ‌రో దెబ్బ‌!

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టెస్టు మ్యాచులు ఆడుతోన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. చేతి వేలికి గాయం కార‌ణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నాలుగో టెస్టుకు దూర‌మైన విష‌యం తెలిసిందే. నాలుగో టెస్టుకు హనుమ విహారి  కూడా దూర‌మ‌య్యాడు. తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో ఈనెల 15 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే ఆ టెస్టులో ఆయ‌న ఆడ‌డం లేదు.

సిడ్నీలో భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య నిన్న జరిగిన చివ‌రి రోజు ఆట‌లో హ‌నుమ విహారి, అశ్విన్ పూర్తిగా డిఫెన్స్ ఆడి మ్యాచ్ ను డ్రాగా ముగిసేలా చేయ‌డంలో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే అతనికి గాయ‌మైంది. టెస్టు ముగిశాక హ‌నుమ‌ విహారికి స్కానింగ్ చేసి, విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. అంతేగాక‌, ఇంగ్లండ్‌తో త్వ‌ర‌లో జరిగే సిరీస్‌కూ అతను దూరమయ్యే అవకాశాలూ లేక‌పోలేద‌ని తెలుస్తోంది.