సీఎం జగన్ రెడ్డిలో అసహనం… ఆందోళన కనిపిస్తున్నాయి

జనసేన ఎందుకు రౌడీ సేన అయిందో ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు ఆయన చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? జగన్ రెడ్డిగారికి గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? సీఎం సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారినీ, వీర మహిళలను, జన సైనికులను, జనసేన పార్టీనీ కించపరుస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలో పేరుకున్న అసహనం, ఆందోళన కనిపిస్తున్నాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.