రాజోలుకు కేటాయించిన నిధులు మళ్ళించడాన్ని వ్యతిరేకించిన దార్ల కుమారి లక్ష్మి

గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజోలు పంచాయతీ నుండి నిధులు మళ్ళించడాన్ని వ్యతిరేకిస్తూ.. తనని నమ్మి ఓట్లు వేసిన ఓటర్ల తరపున రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి గళం వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది కానుకగా జగన్ మోహన్ రెడ్డి గారు మా రాజోలు పంచాయతీకి శాంక్షన్ అయిన 60 లక్షల రూపాయలు కాజేయడం జరిగింది. అసలే నిధులు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడింది అంటే.. ఇప్పుడు వచ్చిన 60 లక్షల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రి తీసుకోవడాన్ని జనసేన పార్టీ తరపు నుండి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. 15 వేల మంది జనాభా ఉన్న రాజోలు గ్రామంలో కనీసం డ్రైనేజ్ బాగు చేయించుకోలేని పరిస్థితి లో ఉండి ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్లు నిర్మించుకో లేక పోతున్నాం. ఆ సంగతి పక్కన పెడితే కనీసం వీధిలైట్లు, త్రాగునీరు కూడా గ్రామంలో అందించలేని పరిస్థితి. కేంద్రం గ్రామాభివృద్ధికి ఇచ్చిన నిధులు పంచాయతీ బోర్డు ఆమోదం లేకుండా ఎలా తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒక రాజోలు మాత్రమే కాదు.. రాష్ట్రంలో రమారమి 13000 పంచాయతీలలో ఇదే పరిస్థితి. ఈ మాత్రం దానికి పంచాయతీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, దేనికి? కేవలం వాళ్లు బొమ్మల్లా మిగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును గ్రామ సర్పంచులు అందరూ కూడా వ్యతిరేకించాలని జనసేన పార్టీ తరపున కోరారు. అదేవిధంగా రాజోలు గ్రామాభివృద్ధికి కేంద్రం నుండి శాంక్షన్ అయిన 60 లక్షల రూపాయలు తిరిగి వెంటనే పంచాయతీ ఖాతాలో జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన తరపున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన తరపున హెచ్చరిస్తున్నాం అని దార్ల కుమారి లక్ష్మి తెలియజేశారు.