పండగలు వస్తున్నాయి… వెళ్తున్నాయి… పేదలకు మాత్రం ఇళ్ళు ఇవ్వడం లేదు

అదిగో పండగ… ఇదిగో సొంతిల్లు అంటూ వైసీపీ పాలకులు ప్రతి పండగకీ ప్రజలను మోసం చేస్తూనే వచ్చారు. సంక్రాంతికి ఇళ్లు ఇస్తాం అన్నారు. ఆ ముహూర్తం వెళ్ళిపోయింది. ఫిబ్రవరికి సిద్ధం అని ఊరించి ఉగాది అన్నారు. తెలుగు వారి కొత్త సంవత్సరాది అయిన ఉగాది వచ్చింది. ఇప్పటికీ పేదలకు సొంతింటి కల తీరలేదు. ఉగాదికి రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాల సొంతింటి కల నెరవేర్చి, గృహ ప్రవేశాలు చేయిస్తామని వైసీపీ పాలకులు చెప్పారు. ఉగాది వచ్చేసినా రాష్ట్రంలో గృహ ప్రవేశాల జాడే లేదు.
17 వేల జగనన్న కాలనీల్లో 28 లక్షల ఇళ్లను కట్టబోతున్నామంటూ పేదల కళ్లకు గంతలు కట్టారు. చివరికి రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని లెక్క తేల్చారు. జూన్, 2022 నాటికే 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మాటలు చెప్పారు. 2023 నాటికి మరో 10 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీలు గుప్పించారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ పాలకులు కేవలం 4.4 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. 2022లో దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా ముహూర్తాలు మార్చినా ఇళ్ల తాళాలు మాత్రం లబ్ధిదారులకు అందలేదు. గృహ ప్రవేశాలు సంక్రాంతి అని మాట మార్చినా.. ఇప్పుడు ఉగాది వచ్చినా ఇళ్ల నిర్మాణంలో మాత్రం ముందడుగుపడలేదు.
ఇంటి స్థలాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని జనసేన మొదటి నుంచి చెబుతోంది. కొండలు, గుట్టల్లో స్థలాలు కొని, వైసీపీ నాయకులు భారీ ధరకు ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. ప్రజా ధనాన్ని జేబులో వేసుకున్నారు. దీని కోసం మాత్రమే జగనన్న ఇళ్లు కార్యక్రమం ఉపయోగపడింది తప్పితే… పేదలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేకపోయింది. పేదల ఇళ్ల కోసం రూ.42,973 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఖర్చుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలి.