భారత్-ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మ్యాచ్.. సత్తా చాటుతున్న టీమిండియా బౌలర్లు

మెలోబోర్న్ క్రీడా మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కంగారూలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన ఆసిస్ ప్లేయర్లు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. భారీ మార్పులతో బరిలోకి దిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే బుమ్రా ఆసిస్ ఓపెనర్‌ జో బర్న్స్ ఔట్ చేశాడు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లను తీశాడు..

38 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసిస్ జట్టును హెడ్, లబుషేన్ ఆదుకున్నారు. దాదాపు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో భారత బౌలర్ బుమ్రా క్రీజులో కుదురుకున్న హెడ్ (38)ను ఔట్ చేశాడు. దీంతో ఆసిస్ 124 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్‌కు మొదటి వికెట్ లభించింది. ఆసిస్ బ్యాట్స్‌మెన్ లబుషేన్(48) అర్ధ శతకం వైపు దూసుకుపోతుండగా… సిరాజ్ మంచి డెలివరీతో ఔట్ చేశాడు. దీంతో ఆసిస్ 134 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.