జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జనసేనాని.. ప్రశ్నలతో దాడి!

  • ఈ నెల 15న వైసీపీ ఆధ్వరంలో ‘విశాఖ గర్జన’
  • జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన పవన్
  • గర్జన దేని కోసమో చెప్పాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖ గర్జన పేరుతో రాజకీయేతర జేఏసీ ర్యాలీ చేపట్టనుంది. దీనిపై తీవ్రంగా స్పందించిన జనసేనాని.

దేనికీ గర్జనలు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి తాజాగా పలు ప్రశ్నలు సంధించారు.

‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?

151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?

ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా?

కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా?

కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా?

ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా? పాలన వైఫల్యాలు దాచుకొనేందుకు కులాల మధ్య చిచ్చు రేపినందుకా?

స్కూల్స్, ప్రభుత్వ భవనాల నుంచి ఆలయ విద్యుత్ అలంకరణ వరకూ పార్టీ రంగులు వేసుకొంటున్నందుకా? హైకోర్టుతో చీవాట్లు తిన్నందుకా?

భర్తీ చేస్తామన్న 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా? పోలీసు రిక్రూట్మెంట్ చేయనందుకా? డిఎస్సీ ఊసు వదిలేసినందుకా?

వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకా?

గ్రామ పంచాయతీల నిధులు మళ్లించేసినందుకా? మా పంచాయతీ నిధులు మాకు ఇవ్వండి అని అడిగిన సర్పంచులను అరెస్టులు చేస్తున్నందుకా?

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేసి అక్రమ రవాణా చేస్తున్నందుకా? మడ అడవులు ధ్వంసం చేసేస్తున్నందుకా?

కాలుష్యకారక పరిశ్రమలు బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ముద్దులుపెట్టి… ఇప్పుడు ఆ పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేస్తున్నందుకా?

విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసినందుకా? ప్రజలు కోరిన మీదటే ఛార్జీలు పెంచామని చెప్పుకొన్నందుకా?

ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్ల  ఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా?

ఫీజు రీ ఎంబర్స్మెంట్ చేయనందుకా? విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి.. నిధులు ఇవ్వనందుకా?

అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా?

రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?

అని ప్రశ్నల వర్షం కురిపించారు.