Rajampeta: మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతున్న నేపధ్యంలో రాజంపేట నియోజకవర్గం జనసేన అభ్యర్ధులు పోరుకు సిద్ధమయ్యారు. 19వ వార్డు నుంచి దీపావళి పండుగ రోజున శ్రీ కొత్తూరు వీరయ్యాచారి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రాష్ట్రంలో రాక్షసపాలన అంతమొందించేందుకు తన గెలుపు తొలి అడుగు కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షిచారు. కులాలను కలిపే ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెడుతూ.. మున్సిపాలిటీ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 27వ వార్డు నుంచి జనసేన అభ్యర్ధిగా శ్రీ కుటలగారి వెంకటయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రజల నెత్తిన పన్నుల భారం మోపిన వైసీపీకి ఓటుతో బుద్ది చెప్పాలని రాజంపేట నియోజకవర్గం జనసేన నాయకులు పిలుపు నిచ్చారు. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో బరిలో దిగుతున్న జనసేన అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.