పోలీసు ఉన్నతాధికారులే అత్యాచారాల కట్టడికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి

• మహిళల రక్షణ గురించి పాలకులు ఎలాగూ పట్టించుకోవడం లేదు
• ఆడబిడ్డలను కాపాడమని విజ్ఞప్తి చేస్తుంటే తల్లితండ్రుల పెంపకాన్ని తప్పుబడుతున్నారు
• అత్యాచార ఘటనలు ఇలాగే కొనసాగితే గౌరవ హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజు అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచార ఘటన గురించి తెలిసి మనసు వికలమైంది. అభంశుభం తెలియని పసివాళ్లపైనా, గర్భిణులపై, మానసిక పరిణతిలేనివారిపై, విద్యార్థినులపై, యువతులపై వరుసగా అఘాయిత్యాలు చోటుచేసుకొంటున్నాయి. వీటిపై బాధ్యతగల ప్రతిపక్షంగా మహిళలకు రక్షణ ఇవ్వండి… వారు ధైర్యంగా తిరిగే పరిస్థితులు కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని నిందించడం లేదు. స్పష్టంగా సూచనలు చేసున్నాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. బాధితులు, వారి కుటుంబాల గౌరవమర్యాదలు కాపాడాలన్న ఉద్దేశంతోనే చట్టంలో ఆ అంశాన్ని పొందుపరిచారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి, గౌరవం కాపాడి, ధైర్యం చెప్పాల్సిన పాలకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పైగా తల్లితండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే మహిళల రక్షణ గురించి పాలకులను ఎలాగూ విశ్వసించలేకపోతున్నాం. అందువల్ల బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందే ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపించి అత్యాచార ఘటనల కట్టడికి చర్యలు తీసుకోవాలి. మృగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటుచేసుకొంటున్నాయి… ఎలా కట్టడి చేయాలనే అంశంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. విషయ తీవ్రత దృష్ట్యా- అత్యాచార ఘటనలు ఆగని పక్షంలో గౌరవ హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని, మహిళ రక్షణకై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం ఆడబిడ్డలను ఎలాగూ కాపాడలేదు… తమ బిడ్డలు మృగాళ్ల బారినపడకుండా తల్లితండ్రులే కంటికి రెప్పలా కాపాడుకోవాలని, సదా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.