రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల..
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. కింది కోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాదు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు పట్టాభి అరెస్టులో సరైన విధానాన్ని అమలు చేయలేదని, రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని పేర్కొంది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సెక్షన్ 41 ఏ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది. 41 ఏ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.