సి.బి.ఐ.కి దత్త పుత్రుడు అని పిలవాల్సి వస్తుంది

• జనసేనను టీడీపీ బి టీం అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటాం
• దేశం కోసం కాదు ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లారు
• 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన మీరా నీతులు చెప్పేది?
• పరామర్శకు వస్తున్నాను అని తెలియగానే బాధిత రైతులకు పరిహారం ఇస్తున్నారు
• ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాల్సిందే
• అనంతపురం జిల్లాలో మీడియాతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించామని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని అన్నారు. వైసీపీ హయాంలో దాదాపు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కౌలు రైతుకు అండగా ఉండాలి, వారి కుటుంబాల్లో భరోసా నింపాలనే ఈ యాత్ర ప్రారంభించాం. ఉదయం నుంచి నాలుగు కుటుంబాలను పరామర్శించి, రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాం. రైతు కుటుంబాలను జనసేన పార్టీ తరఫున పరామర్శిస్తున్నామని తెలిసి ప్రభుత్వం హుటాహుటిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తోంది. ఏడాదిన్నర క్రితం చనిపోయిన వ్యక్తులకు కూడా ఇవాళ వారి కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ పని రైతులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు చేస్తే చాలా బాగుండేది. ఇతర పార్టీలకు పొలిటికల్ మైలేజ్ రాకూడదని చేసినా… ఇప్పటికైనా కళ్లు తెరచి నష్టపరిహారం అందించారు.
• దేశ సేవ చేసి కాదు ఆర్ధిక నేరాలకు పాల్పడి జైలుకెళ్లారు
చాలా మంది వైసీపీ నాయకులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా వాళ్లతో మాట్లాడతాను. నేను వాళ్ల పార్టీ పాలసీలపై మాట్లాడుతుంటే… వాళ్లు మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అగ్ర నాయకత్వానికీ, నన్ను తిట్టే వ్యక్తులకు ఒకటే చెబుతున్నాను… నేను ఏమీ విదేశాల్లో చదువుకోలేదు, లండన్ రాయల్ ఫ్యామిలీ కాదు. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష నాకు వచ్చు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం ఇష్టం లేక మాట్లాడటం లేదంతే. అనంతపురం నుంచి ఇంకొక్కసారి చెబుతున్నాను నన్ను సి.బి.ఎన్.కు దత్తపుత్రుడు అంటే.. నేను మిమ్మల్ని సీబీఐకి దత్తపుత్రుడు అని పిలవాల్సి వస్తుంది. మమ్మల్ని తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ అని మీరంటే… మేము మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అనాల్సి ఉంటుంది. అక్కడ జైల్లో కూర్చొని షటిల్ ఆడుకున్నారు. మీరేమైనా సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ మాదిరి దేశ సేవ చేశారా? ఆర్ధిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చారు. మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శించే స్థాయీ మీకు లేదు. మంచోచెడో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వారి తీర్పుకు కట్టుబడి మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం.
• ప్రతి జిల్లాకు సంక్షేమ నిధి
జనసేన లేని సమస్యను సృష్టించదు. ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. దానిపై స్పందించాలని కోరుకుంటున్నాం. కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమం ప్రారంభించకపోతే ప్రభుత్వంలో చలనం రాదు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. అలాగే మా వంతు సాయం మేము చేస్తాం. అనంతపురంలో ఇది మొదట విడత. అన్ని జిల్లాలు తిరుగుతాం. ప్రతి కౌలు రైతు కుటుంబానికి భరోసా కల్పిస్తాం. వాళ్ల పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా లెక్కన సంక్షేమ నిధి ఏర్పాటు చేసేలా ఆలోచన చేస్తున్నాం. ఈ సంక్షేమ నిధికి నా వంతు సాయం నేను అందిస్తానని” చెప్పారు.