తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుకు మరోసారి గడువు పెంచిన సర్కారు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ కు దరఖాస్తు చేసుకునేందుకు పలుమార్లు గడువు పెంచిన సర్కారు తాజాగా మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ ఎంసెట్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17 వరకు గడువు పెంచుతున్నట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు.

షెడ్యూల్ ప్రకటించిన సమయంలో మే 18న దరఖాస్తులకు చివరి తేదీ అని వెల్లడించారు. తొలుత ఆ డెడ్ లైన్ ను మే 26కి మార్చారు. ఆపై జూన్ 3 వరకు, అనంతరం జూన్ 10 వరకు పెంచారు. ఇప్పుడా గడువును కూడా పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా జూన్ 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.

కాగా, ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి జరుగుతాయని షెడ్యూల్ లో ప్రకటించారు. ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.