తదేకం ఫౌండేషన్ స్ఫూర్తిని జనసైనికులు ముందుకు తీసుకెళ్లాలి

• రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన-తదేకం సంయుక్త సేవా కార్యక్రమాల్లో శ్రీ నాదెండ్ల మనోహర్

మన భద్రత కోసం, దేశం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న వీర జవాన్లు తమ జీతాల నుంచి విరాళాలు ఇచ్చి నడుపుతున్న తదేకం ఫౌండేషన్ స్ఫూర్తిని జనసైనికులంతా ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. జవాన్లు, సీనియర్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ముందుకు వస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో జనసేన పార్టీ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు సేవా కార్యక్రమాలను విస్తరించిన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. శనివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని శాటిలైట్ సిటీ ప్రాంతంలో జనసేన పార్టీ-తదేకం ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడింగొయ్యి జెడ్పీ హైస్కూలుకు స్కూల్ బెంచ్ లు, ఫర్నిచర్, క్రీడా సామగ్రి, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, దివ్యాంగులకు ట్రై సైకిల్స్, మహిళలకు కుట్టు మిషన్లు అందచేశారు. అగ్నిప్రమాదంలో ఇంటిని కోల్పోయిన శ్రీమతి నారాయణమ్మ అనే మహిళకు స్థానిక జనసైనికులు-తదేకం ఫౌండేషన్ సంయుక్తంగా సమకూర్చిన రూ. 2 లక్షలు నూతన గృహ నిర్మాణం నిమిత్తం అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జగ్గంపేట నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలకు తదేకం ఫౌండేషన్ వారు ఇళ్లు కట్టించి ఇచ్చారు. నిస్వార్థంగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న స్కాముల్లా, జగనన్న కాలనీల్లా కాదు. ఒక నిబద్దతతో దీనిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి ఫౌండేషన్ తో కలసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహావతార్ బాబాజీ ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి మాధవి, శ్రీమతి సుధ, పార్టీ నాయకులు శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ బండారు శ్రీనివాస్, శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీ పొలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీమతి గంటా స్వరూప, శ్రీ వై.శ్రీనివాస్, శ్రీ చెరుకూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.