ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కదా… లాభనష్టాల లెక్కలేమిటి?

• పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా డీజిల్ భారం ప్రభుత్వమే భరించాలి
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నాం అని ప్రచారం చేసుకున్న వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాన్ని సంక్షేమ పథకంగా ఎందుకు భావించడం లేదు? అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 70 వేల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో అత్యధికులు పేద, మధ్య తరగతి ప్రజలే. డీజిల్ సెస్ పేరుతో టికెట్ ధరలు పెంచుతూ ప్రయాణీకులపై భారం మోపుతూ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా పేదలను ఇబ్బంది పెట్టేదే. డీజిల్ ధర పెరగటం వల్లే టికెట్ ధర పెంచాల్సి వచ్చిందని చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే. డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నులో రాయితీ ఇచ్చి ఆర్టీసీపై భారం తగ్గిస్తే టికెట్ ధర పెంచాల్సిన అవసరం ఉండదు. ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ గా ఉన్నప్పుడు వాణిజ్య కోణంలో ఆలోచించి లాభనష్టాల ప్రకారం చూసుకోవచ్చు. వైసీపీ ఈ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నందున కచ్చితంగా పాలక పక్షం ప్రజా సంక్షేమం కోణంలోనే ఆలోచన చేయాలి. ప్రజలపై భారం లేకుండా చూడాలి. తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తోంది. అలాంటి పథకం ఏదీ మన రాష్ట్రంలో లేదు. ఇక్కడ భారం మోపి బాదటం తప్ప ప్రయాణీకుల సంక్షేమం గురించిన పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ పరిధిలోనే ఉంది కాబట్టి డీజిల్ భారం ప్రభుత్వమే భరించి సెస్ విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆస్తి పన్ను పెంచారు. చెత్త పన్ను వేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ టికెట్ పెంచారు. రేపటి రోజున ఇంకేమమి పెంచుతారో అనే భయంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇది ప్రజలపట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు… ప్రజలను బాదే ప్రభుత్వం అని శ్రీ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.