యాదాద్రి గర్భాలయంపై విమాన గోపురానికి 60 కేజీల బంగారంతో తాపడం!

యాదాద్రి లక్ష్మీనరసింహాలయం కొత్త శోభను సంతరించుకోనుంది. గర్భాలయంపై 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన విమానగోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 60 కేజీల బంగారం అవసరం అవుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దాతల నుంచి దానిని సేకరించాలని నిర్ణయించిన అధికారులు దాతలు ముందుకు రావాలని కోరారు.

మరోవైపు, ఉత్సవ మూర్తుల నిత్య ఉత్సవాలకు వినియోగించే కొయ్య రథానికి స్వర్ణ తొడుగుల పని దాదాపు పూర్తయింది. రాగి తొడుగులు ఇప్పటికే సిద్ధం కాగా, వాటికి బంగారు తాపడం చేస్తే పని పూర్తయినట్టే. ఈ నెలాఖరు లోపు రథం యాదాద్రికి చేరుకుంటుందని ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా, స్వర్ణ రథం తయారీకి రూ. 60 లక్షలు ఖర్చవుతుండగా దానిని శ్రీలోగిళ్లు, ల్యాండ్‌మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు సురేశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి భరిస్తున్నారు.