24 గంటల్లో కరోనాతో 93 మంది మృతి: ఏపీ హెల్త్ బులెటిన్

ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుండి గడిచిన 24 గంటల మధ్య 57,148 శాంపిల్స్‌ని పరీక్షించగా.. అందులో 9,597 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు. కరోనావైరస్ కారణంగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా కరోనా మృతుల సంఖ్య విషయానికొస్తే.. గుంటూరులో 13 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది, శ్రీకాకుళం జిల్లాలో 9 మంది, అనంతపురంలో ఏడుగురు, కడప జిల్లాలో ఏడుగురు, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 6,676 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 26,49,767 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 2,54,146 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.