ప్రజలతో ప్రతీనిత్యం మమేకం అవ్వండి

  • రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం చారిత్రక అవసరం
  • పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్

గుంటూరు: జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రతీ జనసైనికుడిపై ఉందని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసిన హరిప్రసాద్ ను గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టిన పోరాటాలను ఆళ్ళ హరి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతీరోజూ ప్రజలతో మమేకం అయినప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. నిబద్ధత, నిజాయితీ, భాధ్యత కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి నాయకుడికి అండగా నిలవాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సుని కోరుకునే ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చారిత్రక అవసరమని హరిప్రసాద్ అన్నారు.