ప్రముఖ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత.. ఉపరాష్ట్రపతి సంతాపం

ప్రముఖ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (89) కన్నుమూశారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తుర్లపాటి మరణంపై పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

కుటుంబరావు బెజవాడ పాటిబండవారివీధిలో 1931 ఆగస్టు 10న జన్మించారు. 1946లో 14 సంవత్సరాల వయసులోనే తుర్లపాటి పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టారు. ‘మాతృభూమి’ పత్రికలో ‘స్వరాజ్యంలో స్వాతంత్య్రం’ అనే తొలివ్యాసం 1947 మార్చి 22న ప్రచురితమైంది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. పాత్రికేయుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభాధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా ప్రసిద్ధికెక్కారు. మొత్తంగా 18 మంది ముఖ్యమంత్రుల వద్ద ఆయన పనిచేశారు. 2002లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

ఉపరాష్ట్రపతి సంతాపం

పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. కుటుంబరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘తుర్లపాటి కుటుంబరావు పరమపదించారని తెలిసి చాలా విచారించాను. ఆయన స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సేవకులు, ప్రముఖ పాత్రికేయులు, రచయిత, అద్భుతమైన వక్త. టంగుటూరి ప్రకాశం పంతులుగారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన నాటి నుంచి ఏ రంగంలో అయినా ఉన్నత ప్రమాణాలు పాటించి ఆదర్శంగా నిలిచారు. ఈ మధ్య నేను విజయవాడ వచ్చిన సందర్భంగా ఇంత వయసులో కూడా నేను బసచేస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వచ్చి నాతో అనేక విషయాలను ప్రస్తావించి ఉత్సాహంగా కనిపించారు. ఇంతలోనే వారి మృతి వార్త వినాల్సి రావటం విచారకరం. ఆయన చూపిన మంచి మార్గాన్ని, మంచి సంప్రదాయాన్ని కొనసాగించటమే మనం అయనకు ఇచ్చే నిజమైన నివాళి’ అని సంతాప సందేశంలో వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.