అఖిలప్రియ‌ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

హఫీజ్‌పేట్ భూముల వ్యవహారానికి సంబంధించి బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేయ‌గా ప్ర‌స్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే.  ఆమె బెయిల్ పిటిష‌న్ మ‌రోసారి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. అంతేకాదు, ఆమెను క‌స్ట‌డీకి ఇవ్వాల‌న్న పోలీసుల పిటిష‌న్ కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. దీంతో అఖిల ప్రియను మూడు రోజుల పోలీసుల‌ క‌స్ట‌డీకి తీసుకోనున్నారు.

ద‌ర్యాప్తులో పురోగ‌తి కోసం ఏడు రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు కోరారు. అయితే, నేటి నుంచి ఈ నెల 13 వ‌ర‌కే ఆమెను పోలీసుల‌ క‌స్టడీకి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. కాగా, మెరుగైన వైద్యం కోసం తనను ఆసుప‌త్రికి తరలించాలని అఖిలప్రియ ఇంత‌కు ముందు పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే అందుబాటులో వైద్యులు, తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది.