టీఎస్ఆర్టీసీకి జాతీయ పురస్కారం
టీఎస్ఆర్టీసీకి మరో జాతీయ పురస్కారం లభించింది. ఇంధన పొదుపులో రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నది. 4001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల క్యాటగిరీలో ఈ ఘనత సాధించింది. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలానికి కేంద్ర పెట్రోలియం, సహజవనరులశాఖ ఈ అవార్డును ప్రకటించింది. శనివారం ఢిల్లీలో వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ అవార్డుతోపాటు రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్ పర్ లీటర్) 5.16 ఉండగా, 2020లో అది 5.28కి పెరిగింది. దీనివల్ల సంస్థకు దాదాపు రూ.19 కోట్ల మేర ఆదా అయ్యింది. మరోవైపు, రాష్ట్రస్థాయి ఇంధనపొదుపులో హయత్నగర్-1, ఉప్పల్, దిల్సుఖ్నగర్ డిపోలు ఉత్తమ డిపోలుగా నిలిచాయి.