అఖిల బెయిల్ మంజూరు చేసిన సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు

ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావు అతని సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి అఖిల ప్రియ పలు అభియోగాలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితురాలుగా అఖిల ప్రియ ఉండగా, ఆమె భర్త భార్గవ్ రామ్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం అఖిలప్రియ దాఖలు చేసుకున్న పిటిషన్లను కోర్టులు త్రోసిపుచ్చగా, ఇవాళ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా, హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా భూమా అఖిల ప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ షరతులు ప్రకారం అఖిల ప్రియ 10 వేల రూపాయల రెండు ష్యూరిటీలు సమర్పించాలని బెయిల్ మంజూరు సందర్భంలో కోర్టు ఆదేశాలిచ్చింది. ఫలితంగా రేపు అఖిల ప్రియ జైల్ నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఆమె భర్త భార్గవ్ రామ్ కు సికింద్రాబాద్ కోర్ట్ లో చుక్కెదురైంది. భార్గవ్ రామ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్ట్ కొట్టి వేసింది.