“గద్దర్ యాది సభ”ని విజయవంతం చేయాలి: శివ కోటి యాదవ్

నర్సంపేట, ఆదివారం రోజున గద్దర్ యాది సభ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో జరిగే “గద్దర్-జహీర్ అలీ ఖాన్ యాది సభ” కి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు, కార్మిక, ప్రజా సంఘాల సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐక్య వేదిక కో-కన్వీనర్ మరియు జన సేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివ కోటి యాదవ్ పోస్టర్ ఆవిష్కరణ చేసి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శివ కోటి యాదవ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి మాట్లాడుతూ తాడిత పీడిత అణగారిన వర్గాలను చైతన్యం చేయడమే లక్ష్యంగా గద్దర్ తుది శ్వాస వరకు పోరాడారని, తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గలంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిదని అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. అంతేగాక గద్దర్ ప్రజా చైతన్య ఆట పాటల ద్వారా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలనే తపన ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావానికి రూపుదాల్చిందని, గద్దర్ కు పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంగ మధు, ఒర్సు రాజేందర్, గంగుల రంజిత్, బొబ్బ పృథ్వీరాజ్, షేక్ హుస్సేన్ పాష, రొడ్డ శ్రీకాంత్, గాండ్ల అరుణ్, తిప్పతి రమేష్, కర్కాల రణదీప్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.