మొక్కల పెంపకమే.. భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి

మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన అఖిల భారత ఉద్యానవన ప్రదర్శనను గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవుల పునరుద్ధరణ చేపట్టి, పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పట్టణంలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పచ్చదనానికి స్థానిక సంస్థల బడ్జెట్‌లో పదిశాతం నిధులు కేటాయించినట్లు చెప్పారు. మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లేనని, ఆస్తులు ఇచ్చినా నిలుపుకుంటారో లేదో తెలియదన్నారు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చని, కానీ ఆరోగ్యం పోతే తిరిగి రాదన్నారు. మంచి పర్యావరణంతోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించే హరితహారం, సామాజిక అడవుల పెంపకం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

నగర, పట్టణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పది శాతం నిధులు పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మొక్కలు పెంచడం మన వ్యక్తిగత బాధ్యత అన్నారు. ప్రస్తుతం వాటర్‌ బాటిల్స్ కొనడం మనం చూస్తున్నామని, మొక్కలు పెంచకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందేమోనన్నారు. ప్రకృతిని ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడమేనని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 120 స్టాల్స్‌ను హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర వాసుల కోసం మేళాలో ఏర్పాటు చేశారని, తీరిక లేని పనులతో ఉండే నగర వాసులు ఇంట్లో మొక్కలు పెంచితే పని ఒత్తిడిని జయిస్తారని మంత్రి పేర్కొన్నారు. కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ ట్రెండ్‌ను నగర వాసులు అనుసరిస్తున్నారన్నారు. అందరూ విధిగా పాటించడంతో పాటు మొక్కల పెంపకాన్ని పిల్లలకు నేర్పించాలని కోరారు. మొక్కలు ఆనందాన్ని, మానసికోల్లోసాన్ని కలుగజేస్తాయని చెప్పారు. కాగా, మేళాలో ఆర్గానిక్, బోన్సాయ్, ఔషధ, అన్ని రకాల పూల, పండ్ల మొక్కలతో పాటు పెంపకానికి అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నాయి.