రాష్ట్ర ప్రజలు బాగు కోసమే!

  • టిడిపితో పొత్తును జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు
  • ప్రజా పాలన సాగించేలా పాలకులకు బుద్ధి ప్రసాదించాలి
  • వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండేలా పాలకులకు గుణపాఠం చెప్పాలి
  • సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: రాష్ట్ర ప్రజల బాగు కోరి, రాష్ట్రాన్ని కాపాడేందుకే టిడిపితో జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారని జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు అన్నారు. గురువారం రాష్ట్ర ప్రజలు బాగుండాలని పార్వతీపురం పట్టణంలోని సాయిబాబా గుడిలో జనసేన పార్టీ నాయకులు టిడిపి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తమ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. పాలకులు ప్రజా పాలన సాగించేలా బుద్ధి ప్రసాదించాలని భగవంతున్ని కోరామన్నారు. మంత్రులు, మేయర్లు తదితర నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి ప్రజా సంక్షేమము పాలనపై దృష్టి సారించేలా వారికి హితవు పలకాలని పూజలు చేశామన్నారు. అనంతరం పట్టణ మెయిన్ రోడ్ లోని తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తును స్పష్టం చేయటం ఆనందదాయకంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు తమ జనసేనాని పొత్తును ప్రకటించారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉన్న కష్టకాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మేధావులు గుర్తించాలన్నారు. సమర్థతలేని పాలకులు చేతిలో రాష్ట్రం ఆదోగతి పాల అయిందన్నారు. దాదాపుగా వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయ్యాయన్నారు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు ప్రకటించారన్నారు. ఇకపై పార్వతీపురంలో టిడిపి, జనసేన పార్టీలు రెండు కలిసి పని చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల పక్షాన ఉమ్మడి పోరు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.