బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు బీసీల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఒకరినొకరు కలవకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. చెయ్యి చాచే విధానానికి స్వస్తి పలికి, శాసించే స్థాయికి బీసీలు ఎదగాలంటే శాసనసభలో యాభై శాతానికి పైగా బీసీల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. అప్పుడే సమస్యలపై గళం ఎత్తి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 50 శాతానికి పైగా బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ పెట్టి నిధులు కేటాయించలేదని, కేవలం మభ్య పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. బీసీలను ఈ ప్రభుత్వం అణగదొక్కిందన్నారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందన్నారు. పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటూ వారి మార్గదర్శకంలో బీసీల హక్కుల సాధన కోసం, సంక్షేమం కోసం పోరాడదామని రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అరాచక, విధ్వంసకర శక్తులను రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు బీసీలంతా ఐక్యం కావాలన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్సీ రామారావు, నూజివీడు టిడిపి ఇన్చార్జ్ ముదిరిబోయిన వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి పలు కులసంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.