‘కోటి వృక్షార్చన’లో భాగస్వామ్యులు కండి.. టాలీవుడ్‌ ప్రిన్స్‌..

భూతాపం పెరగడం, మంచు పర్వతాలు కరగడం, దీంతో సముద్రాల్లో నదుల్లో నీటి మట్టాలు పెరగడం, జల ప్రళయాలు సంభవించడం. వీటంన్నింటికీ కారణం కాలుష్యం ఒక్కటే. మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోన్న కాలుష్యంపై యావత్‌ ప్రపంచం యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ భారీ ఎత్తున గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ పాల్గొంటూ పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారు. తాము మొక్కలు నాటడమే కాకుండా ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మరోకరికి మొక్కలు నాటమని చెబుతూ సాగుతోన్న ఈ చాలెంజ్‌ ఓ ఉద్యమంలా నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమంలో మరో అద్భుత ఘటన ఆవిష్కృతం కానుంది. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంటే కేవలం ఒక్క రోజే కోటి మొక్కలు నాటే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఈ కార్యక్రమానికి సినీ నటుడు, టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు మద్దతు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇది వరకు తనతో పాటు కుమారుడు గౌతమ్‌, కూతురు సితార మొక్కలు నాటుతోన్న వీడియోను పోస్ట్‌ చేసి మహేష్‌.. ‘గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మొక్కలు నాటడమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా (ఫిబ్రవరి 17) ఎంపీ సంతోష్‌ నిర్వహించ తలపెట్టిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం భాగస్వామి అవుదాం’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు.