మాక్స్‌వెల్‌ ఐపీఎల్ ధర పై వార్నర్ స్పందన…

ఓ ఫ్రాంఛైజీ వదులుకున్న మాక్స్‌వెల్‌ను మరో ఫ్రాంఛైజీ భారీ ధరకు దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. పంజాబ్‌ వదులుకున్న మాక్స్‌వెల్‌ను ఐపీఎల్‌ వేలంలో బెంగళూరు రూ.14.25 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా×న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కామెంటర్‌గా వెళ్లిన వార్నర్‌.. మాక్సీ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇలా సరదాగా మాట్లాడాడు. ”ఐపీఎల్‌ వేలంలో మాక్స్‌వెల్‌కు భారీ ధర పలకడం చెడ్డ విషయమేమీ కాదు. అయితే ఓ ఫ్రాంఛైజీ వదులుకున్న ఆటగాడికి మరో ఫ్రాంఛైజీ అంతకంటే ఎక్కువ ధర చెల్లించడం ఆశ్చర్యంగా ఉంది” అని వార్నర్‌ పేర్కొన్నాడు. దీనికి మరో వ్యాఖ్యాత మార్క్‌ వా స్పందిస్తూ.. ”గత ఐపీఎల్‌ సీజన్‌ ప్రదర్శన ఆధారంగా తీసుకున్నారనుకుంటా” అని సరదాగా బదులిచ్చాడు. 2020 ఐపీఎల్‌లో మాక్సీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన అతడు 15 సగటుతో 108 పరుగులే చేశాడు. అంతేగాక అతడు ఒక్క సిక్సర్‌ కూడా సాధించకపోవడం గమనార్హం. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మాక్స్‌వెల్‌ ఒక పరుగుకే వెనుదిరిగాడు.