కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న మంత్రి ఈటల

హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా హుజూరాబాద్‌లోని ప్రాంతీయ దవాఖానలో కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని చెప్పారు. 60 ఏండ్లు పైబడినవారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న దవాఖానల్లో టీకా వేయించుకోవాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడివారితోపాటు దీర్ఘకాలి వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనావేస్తున్నారు. తొలిరోజు 90 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా పంపిణీ చేస్తారు. cowin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా వేయనున్నారు.

దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా టీకా పంపిణీ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హైదరాబాద్‌ కంపెనీ అయిన భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ను ప్రధాని వేయించుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై జరుగుతున్న పోరులో శాస్త్రవేత్తలు, డాక్టర్లు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.