ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
- నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్
గుంటూరు: వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం ముప్పైఏళ్లు వెనక్కిపోయిందని, ప్రజలు పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 54వ డివిజన్ అధ్యక్షుడు యజ్జు రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్, కళాకారుల కాలనీల్లో పర్యటించారు. పెద్దఎత్తున మహిళలు నేరేళ్ళ సురేష్ కు అడుగడుగునా హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు నెలకొన్నాయన్నారు. సంక్షేమ పథకాలతో ఇచ్చేది పది రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసేది వంద రూపాయలన్న విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. కరెంట్ బిల్ వస్తుందంటే చాలు ప్రజల గుండె గుబేల్ అంటుందని ధ్వజమెత్తారు. ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని దుయ్యబట్టారు. ప్రజలు వైకాపా పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలన కోసం జనసేన టిడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను నేరేళ్ళ సురేష్ కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, బిట్రగుంట మల్లికా, వీరిశెట్టి సుబ్బారావు, త్రిపుర, ఉపాధ్యక్షులు భారీగా చంద్రశేఖర్, శ్రీనివాసరావు, చొక్కా అనసూయ, జగ్గా శేషగిరి, రాజనాల నాగలక్ష్మి, కోయిలగుంట భవాని ఈశ్వర్, గంటా సాయి కృష్ణ, టిడిపి వార్డు ప్రెసిడెంట్ ఆనంద్, కార్పొరేటర్ అభ్యర్థి చిట్టెం సింధు, వీరమహిళలు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-6.58.18-PM-1024x768.jpeg)