మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం..!

  • పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
  • అమరావతి అభివృద్ధి ఆగిపోవడానికి ఆర్కేనే కారణం.
  • బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేశంలోనే నెం.1గా అమరావతిని తీర్చిదిద్దుతానని యువనేత నారాలోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని పీఈపీఎల్ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ లో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా అక్కడ నివాసితులను కలుసుకున్నారు. నారా లోకేష్ తో పాటు గుంటూరు పార్లమెంట్ టీడీపీ నాయకులు డా.పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో ఆనాడు అమరావతిని అందరి ఆమోదంతో రాజధానిగా ఏర్పాటుచేసుకున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేశాం. రాష్ట్రప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో జగన్ కు ఓటువేశారు. వైసీపీ వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశారు. ఇక్కడ పనులు ఆగిపోవడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే కారణం. కేసులు వేసి రాజధాని ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఉపాధి కోసం మన ప్రాంత యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది. ప్రజాప్రభుత్వం వచ్చాక అమరావతికి పూర్వవైభవం తీసుకువస్తాం. మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

బ్లాక్ డెవలప్మెంట్ మోడల్ తో అభివృద్ధి!
2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు నేను మంగళగిరికి వచ్చా. 5,350 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పటి నుంచి కసి, పట్టుదలతో నియోజకవర్గంలోనే ఉండి పనిచేస్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యా. ప్రతిపక్షంలోనే ఇక్కడకు రెండు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాం. నన్ను, పెమ్మసాని చంద్రశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. డబుల్ ఇంజన్ లా పనిచేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తాం. బ్లాక్ డెవలప్మెంట్ విధానంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్క్ లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంగళగిరి మీదుగా వెళ్లే బస్సులు, రైళ్లు ఇక్కడ ఆగేవిధంగా చర్యలు తీసుకుంటాం. మంగళగిరిని గోల్డ్ క్లస్టర్ గా మారుస్తాం.

బిడ్డల భవిష్యత్తుకు బాబును గెలిపించాలి: పెమ్మసాని
గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… ఈసారి అధికారమార్పిడి కేవలం రాజకీయంగా అధికార మార్పిడికి సంబంధించినది కాదు.. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్ కు సంబంధించినది. అమరావతిని కాపాడుకోవడానికి, చదుకున్న బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడు విజనే కారణం. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి కూడా అభివృద్ధి చెంది ఉండేది. రాష్ట్రానికి మధ్యలో ఉంది, నీటి వనరులు ఉన్నాయని ఆనాడు అమరావతిని రాజధానిగా చేశారు. వైసీపీ వచ్చిన తర్వాత అంతా నాశనం చేశారు. డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించి లోకేష్ ను, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

మంగళగిరిలో ఒకతరం భవిష్యత్ దెబ్బతింది: చిల్లపల్లి
మంగళగిరి జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైసీపీ విధ్వంసక విధానాలతో మంగళగిరిలో ఒకతరం భవిష్యత్ దెబ్బతింది. పెట్టుబడులు, పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. సంపద సృష్టించే వారిని తరిమికొట్టారు. విచ్ఛిన్న శక్తులకు అడ్డుకట్టపడాలంటే లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలి. మంగళగిరి రైల్వే స్టేషన్, బస్టాండ్ లో అన్ని ట్రైన్లు, బస్సులు ఆగేవిధంగా చూడాలి. లోకేష్ వినూత్న రీతిలో రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా పీఈపీఎల్ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విజయవాడ-గుంటూరుని హైదరాబాద్-సికింద్రాబాద్ మాదిరి జంటనగరాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో లోకేష్ ఓటమి కారణంగా ఏం కోల్పోయామో గ్రహించాం. 2024లో లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మంగళగిరి రైల్వే స్టేషన్ లో వివిధ రైళ్లకు స్టాప్ లేదని, బస్టాండులో కూడా రాత్రి 8తర్వాత బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.