ఓటుకు నోటు కేసులో పిటిషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ హైదరాబాదు ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసు విచారణను వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 8 వరకు విచారణ వాయిదా వేయాలని తన పిటిషన్ లో కోరారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తాను హాజరు కావాల్సి ఉందని, అందుకే కేసు విచారణను నెల రోజుల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ… రేవంత్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అనంతరం కోర్టు మంగళవారానికి వాయిదా పడింది.