జగన్ పాలనకు చరమగీతం పాడనున్న కుటమి మ్యానిఫెస్టో
- టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోలో విప్లవాత్మక నిర్ణయాలు
- అభివృద్ధి, సంక్షేమం.. సమతూకం
- జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ భరోసా ఇచ్చి, సంక్షేమ, అభివృద్ధి పాలన అందించే విధంగా టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్, ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెంటేల బాలాజి చెప్పారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కేవలం ఎన్నికల మ్యానిఫెస్టో మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు దర్పణంగా నిలిచిందని అభివర్ణించారు. అభివృద్ధినీ, సంక్షేమాన్నీ సమతుల్యం చేస్తూ.. రాష్ట్ర భవిష్యత్తుకు మేలు బాటలు వేసేందుకు రూపొందించిన దార్శనిక పత్రంలా ఉందని ప్రశంసించారు. అణగారిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, వారి సామాజిక అభ్యున్నతికి భరోసానిచ్చేందుకు ఎంతో శ్రద్ధతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం జేజేలు పలుకుతుందన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు.. వైకాపా ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేందుకు మ్యానిఫెస్టోలో విస్తృత కసరత్తు చేశారని వివరించారు. కుటమిలోని అన్ని పార్టీలు మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళితే ఘన విజయం సుసాధ్యమౌతుందని వెల్లడించారు. బీసీలకు మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారని, మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు, యువత ఉపాధికి, అభ్యున్నతికి విశేష ప్రాధాన్యమిచ్చారని వివరించారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ, భవిష్యత్తుకు భరోసానిస్తూ, సముచిత అవకాశాలు కల్పిస్తామన్న నమ్మకం కలిగించారని వెల్లడించారు. జగన్ పాలనకు చరమగీతం పాడే కుటమి మ్యానిఫెస్టో ఈ ఒక్క మ్యానిఫెస్టోతోనే ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడవచ్చని తెలిపారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా యువతకు అనేక హామీలిచ్చి వారిని మభ్యపెట్టారని. అధికారంలోకి వచ్చాక వారికి తీరని ద్రోహం చేశారని మండి పడ్డారు. మెగా డీఎస్సీ వేస్తానని చెప్పి..ఐదేళ్లపాటు ఊరించి… ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి నెల రోజుల ముందు కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియా నిలిచిపోయిందన్నారు. కాని అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల చొప్పున టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోల నిరుద్యోగ భృతి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వంటి..యువతలో ఆనందోత్సాహాలను నింపే అనేక నిర్ణయాలను ప్రకటించారని, ఇందువల్ల యువతకు భరోసా కుటమితోనే అన్న విషయం సుస్పష్టమైందన్నారు. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోలక్షల ఎకరాల ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి అధికారంలోకి రాగానే ఆ యాక్టును రద్దు చేస్తామని ప్రకటించటం శుభసూచికమన్నారు.