తిరుపతి మెగా కుటుంబం అడ్డా – కిరణ్ రాయల్

తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ నందు ఉమ్మడి చిత్తూరు జిల్లా మెగా అభిమానులతో గురువారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు, ప్రముఖ సినీ నిర్మాత ఏ ఏం రత్నం, ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కిరణ్ రాయల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మెగా అభిమానులు అందరూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనను గద్దె దించేందుకు మెగా అభిమానులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, కూటమిలో జనసేన తరపున పోటీ చేస్తున్న 21 మంది ఎమ్మెల్యే, మరియు ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా పొత్తులో పోటీ చేస్తున్న వారికి కచ్చితంగా మెగా అభిమానులు వారి పూర్తి మద్దతునివ్వాలని కోరారు. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఆదేశాల మేరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయానికి మనమంతా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, ఈ సీటును మనం కైవసం చేసుకోవాలని, గతంలో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గెలుపుకు కృషి చేసిన వారందరూ ఇప్పుడు ఏకమవాల్సిన సమయం ఆసన్నమైందని, మెగా అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులను కూడా కలుపుకొని ముందుకు సాగాలని, తిరుపతి మెగా కుటుంబం అడ్డా అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాల నాయకులు పగడాల మురళి, పూల ప్రభాకర్, ప్రకాష్, పురుషోత్తం, మరియు ఆకేపాటి సుభాషిని, శిరీష, పొన్నగంటి భాస్కర్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.