జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఈసీ సమావేశం బహిష్కరణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 8 వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని నిన్నటి రోజున కొత్త ఎస్ఈసి నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 న ఎన్నికలు, 10 వ తేదీన ఫలితాలు వెలువరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎస్ఈసి నీలం సాహ్ని విడుదల చేశారు. అయితే, దీనిపై జనసేన పార్టీ మండిపడింది. ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ హైకోర్టులో కేసులు ఫైల్ చేసిందని, దానిపై తీర్పు ఇంకా వెలువడక ముందే ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈరోజు జరిగే ఆల్ పార్టీ మీటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి లబ్ది చేకూర్చేందుకే కొత్త ఎస్ఈసి ఈ విధమైన నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.