‘పవన్’ , ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ మధ్య కుదిరిన భారీ డీల్..!

మొదటి నుంచి కూడా పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం విభిన్నంగానే ఉంటూ వచ్చింది. ఒక వైపున హీరోగా తన సినిమాలు చేసుకుంటూనే, నిర్మాతగానూ ఆయన ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ను స్థాపించారు. తన అభిరుచికి తగిన సినిమాలను ఆయన ఈ బ్యానర్ పై నిర్మిస్తూ వస్తున్నారు.

ఇక టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న నిర్మాణ సంస్ధ పేరు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’. ఈ బ్యానర్ క్రింద విశ్వప్రసాద్ – వివేక్ కూచిబొట్ల వరుస సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నిర్మాతలు కొత్త సినిమాల నిర్మాణ పరంగా పవన్ కల్యాణ్ తో చేతులు కలిపారు.

ఈ రెండు బ్యానర్ల మధ్య తాజాగా ఒక భారీ డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారం ఈ రెండు బ్యానర్లు కలిసి వరుసగా 15 సినిమాలు నిర్మించనున్నాయి. తక్కువ బడ్జెట్ లో 6 సినిమాలను .. ఓ మాదిరి బడ్జెట్ లో 6 సినిమాలను .. 3 భారీ చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

యువ దర్శకులను .. కథారచయితలను ప్రోత్సహించడం తమ ప్రధానమైన ఉద్దేశమని చెప్పారు. ప్రతిభ కలిగినవారికి తమ తోడ్పాటు ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు. తమ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటామనే విషయాన్ని స్పష్టం చేశారు.