తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానంగా నిర్దారణ

శ్రీరాముడికి నమ్మినబంటుగా పురాణాల్లో చిరఖ్యాతిని పొందిన హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరుల్లోనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ధారించింది. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానం అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఈ నెల 13న ఉగాది రోజున అధికారికంగా ప్రకటించనుంది. ఆంజనేయుడి జన్మస్థలం తెలుగు గడ్డపైనే అని నిరూపించేందుకు అనేక పురాణ, శాస్త్రీయ ఆధారాలను టీటీడీ సిద్ధం చేసింది. వాటిని కూడా ఉగాది నాడు వెల్లడించనుంది.

అంజనీపుత్రుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు గత డిసెంబరులో కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు అనేక పర్యాయాలు సమావేశమై చర్చించారు. ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు కమిటీ ఐదు పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది.