పవన్‌ త్వరగా కోలుకోవాలి: మహేష్ బాబు

జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రముఖ నటుడు మహేష్బాబు సైతం పవన్‌ గురించి ట్వీట్‌ చేశారు. పవన్‌ త్వరితగతిన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు మహేష్ పేర్కొన్నారు. మహేష్ తోపాటు తమన్‌, బండ్లగణేశ్‌, నాగబాబు సైతం పవన్‌ గురించి పోస్టులు పెట్టారు.

ఇటీవల తన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది కరోనా బారిన పడడంతో పవన్‌ కొన్నిరోజుల నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.