ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు భార్యా వియోగం..కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. రాధాకృష్ణ సతీమణి, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌ వేమూరి కనకదుర్గ(63) కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు కనకదుర్గ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు ..

కనకదుర్గ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా చూసుకునేవారని.. ఆమె సేవా భావం కలిగిన వ్యక్తి అని అన్నారు. కనకదుర్గ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

పవన్‌ కళ్యాణ్..

వేమూరి కనకదుర్గ మరణంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రాధాకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.