తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: 45+ వారికే టీకా !

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేవలం 45 ఏళ్లు దాటిన వారికే కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే టీకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకొని వారికి టీకాలు వేయటం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీలోని ఒకో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగతా చోట్ల ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు వేయనున్నట్లు తెలిపారు శ్రీనివాస రావు. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. సోమవారం రోజున రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 5695 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485 కి చేరింది. ఇందులో 3,73,933 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 80,135 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.