భయం వద్దు.. ఏపీ కరోనా రకం బలమైనదేమీ కాదు..

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా రకంపై కేంద్ర బయోటెక్నాలజీ శాఖ స్పష్టతనిచ్చింది. ఏపీలో వెలుగు చూసిన రకం అంత బలమైనదేమీ కాదని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు.

వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్.440కె రకం బయటపడిందని, అయితే అంతే వేగంగా అది మాయమైందని అన్నారు. దాని విస్తరణ కనిపించలేదని స్పష్టం చేశారు. దాని క్లినికల్ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదన్నారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా కొత్త వైరస్ రకాలేమీ లేవని పేర్కొన్నారు. ఇది వ్యాప్తి పరంగా, తీవ్రత పరంగా ప్రభావం చూపుతోందన్నారు. బి.618 రకాన్ని కనుగొన్నప్పటికీ అది త్వరగానే అంతర్థానమైందని రేణు స్వరూప్ తెలిపారు.