తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం పొడిగింపు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించారు. రాత్రి పూట కర్ఫ్యూ ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అటు, కేంద్రం చర్యల నేపథ్యంలో తెలంగాణ సర్కారు తాజా మార్గదర్శకాలు వెలువరించింది. వివాహ వేడుకలకు 100 మందికి మించి హాజరుకారాదని స్పష్టం చేసింది. అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొంది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత కార్యక్రమాలపై నిషేధం విధించింది.