కొవిడ్ వేళ దేశానికి ప్రాణ వాయువు అందించనున్న సెలబ్రిటీలు..

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను తీవ్ర నష్టానికి గురి చేస్తోంది. కేవలం ఆర్థికంగానే కాకుండా ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఊపిరితిత్తులపై దాడి చేస్తోన్న ఈ మాయదారి రోగం ప్రాణావాయువు అందకుండా చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటుంది. వేల సంఖ్యలో చోటుచేసుకుంటున్న కరోనా మరణాలు యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఎక్కడ చూసినా హృదయ విదాకర దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ప్రాణ వాయువు లేక ఎంతో మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సంస్థలు ఆక్సిజన్‌లు అందిస్తూ తమ వంతు కృషి చేస్తున్నాయి. తాజాగా కరోనా బాధితులకు అండగా నిలుస్తూ మేఘా సంస్థ.. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలోనే తాజాగా దేశానికి ఊపిరి అందించే క్రమంలో సెలబ్రిటీలు ఐ బ్రీత్ ఫర్ ఇండియా అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా వర్చువల్‌ పద్దతిలో విరాళాల సేకరణకు పూనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి లారా దత్తా, శ్యామ్‌ వల్లభ్‌జీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ స్వచ్ఛంద విరాళాల సేకరణ ఉద్యమంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, అనిల్‌కపూర్‌, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌తో పాటు పలువరు క్రికెటర్లు కూడా భాగస్వామ్యులు కాబోతున్నారు. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే రానా, సమంత ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నారు.