అంబులెన్స్‌లను నిలిపేయడం మానవత్వమేనా.. తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడంపై ఆగ్రహం తెలిపింది. విపత్తు వేళ అంబులెన్స్‌లను నిలిపేయడం మానవత్వమేనా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్‌లు ఆపారని ప్రశ్నించింది. రాత్రి కర్ఫ్యూ సరిగా అమలు కావడం లేదని ఆక్షేపించింది. రంజాన్‌ తర్వాతే కరోనా కట్టడిపై తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించింది. మతపరమైన ప్రదేశాల్లో జనసమీకరణ ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

”మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదు. ప్రభుత్వం చెప్పే విషయాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదు. కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశిస్తే మరింత తగ్గిస్తారా.? నిబంధనల ఉల్లంఘనపై మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేయడం బాధాకరం. అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు ఏంటో చెప్పండి” అని హైకోర్టు ప్రశ్నించింది.