తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. మంత్రులందరితో మంగళవారం సీఎం ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రులందరి అభిప్రాయ సేకరణ అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు.

రాష్ట్రంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. లాక్‌డౌన్‌తో కొవిడ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగించింది.