ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
74వ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించి అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. అనంతరం ప్రసంగిస్తూ ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని జగన్ సందేశాన్ని ఇచ్చారు.