అనారోగ్యంతో బాధపడుతున్న ఫొటో జర్నలిస్టుకు చిరంజీవి ఆర్థికసాయం

చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు కరోనా కారణంగా స్తంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి విరివిగా ఆర్థికసహాయాలు చేస్తూ పెద్దమనసు చాటుకుంటున్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే అనేకమందికి చెక్ లు అందజేశారు. తాజాగా, సీనియర్ సినీ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్ కు కూడా చిరు ఆర్థికసాయం అందించారు.

భరత్ భూషణ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో సాయం అర్థించారు. వెంటనే స్పందించిన చిరంజీవి తన ప్రతినిధుల ద్వారా భరత్ భూషణ్ కు రూ.50 వేల చెక్ అందించారు. చెక్ అందుకున్న భరత్ భూషణ్ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న తమ పట్ల వెంటనే స్పందించారని కొనియాడారు. చిరంజీవితో తనకు సాన్నిహిత్యం ఉందని, ఆయనది మంచి మనసు అని కీర్తించారు.