షర్మిల కొత్త పార్టీ పేరు.. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన సన్నాహక సభలో త్వరలోనే పార్టీ పేరు వెల్లడిస్తామని షర్మిల ప్రకటించారు. ఈ నేపథ్యంలో, షర్మిల ముఖ్య అనుచరుడు రాజగోపాల్ ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీని నమోదు చేశారు. షర్మిల స్థాపించబోయే నూతన పార్టీ ఇదేనని ప్రచారం జరుగుతోంది.

కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను రాజగోపాల్ సీఈసీకి సమర్పించారు. పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ పార్టీ చైర్మన్ హోదాలో రాజగోపాల్ పత్రికా ప్రకటన కూడా ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే షర్మిల అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.