విశాఖలో స్కూలు కూల్చివేతపై సీఎం జగన్ కు వీడియో సందేశం పంపిన మాజీ క్రికెటర్

విశాఖలో ఇటీవల హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేత అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయంలో ఏపీ సర్కారుపై భారీగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంలో భారత మాజీ క్రికెటర్, టీమిండియా సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.

స్కూలు కూల్చివేతను నిరసిస్తూ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు ఆయన ఓ వీడియో సందేశం పంపారు. ఆ పాఠశాల 140 మంది విద్యార్థులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. పాఠశాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను, ఎంపీ విజయసాయిరెడ్డిని ఎమ్మెస్కే కోరారు.

ఇదే అంశంలో ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖ విజయసాయి అడ్డాగా మారుతోందని విమర్శించారు. మానసిక దివ్యాంగుల పాఠశాలకు సాయం చేయాల్సిందిపోయి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని మండిపడ్డారు.