ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

ఏపీలో కరోనా పరిస్థితుల కారణంగా విద్యా సంవత్సరం కుదుపులకు గురవడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఆలస్యం అయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తాజా తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఈఏపీ సెట్ (గతంలో ఎంసెట్)ను నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూ చేపట్టనుంది.

సెప్టెంబరు 17, 18 తేదీల్లో ఐసెట్ (విశాఖ ఏయూ), సెప్టెంబరు 19న ఈసెట్ (అనంతపురం జేఎన్టీయూ), సెప్టెంబరు 21న ఎడ్ సెట్ (విశాఖ ఏయూ), సెప్టెంబరు 22న లాసెట్ (తిరుపతి ఎస్వీయూ) పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్ (తిరుతి ఎస్వీయూ) జరపనున్నారు.